పిచ్చాటూరు, ఆగస్టు 1 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలం గోవర్ధనగిరి, ముడియూరు సచివాలయాల్లో చేపట్టనున్న రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా శనివారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాసిల్దార్ వై. చంద్రబాబు నాయుడు రైతులకు రీ-సర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, రికార్డుల సవరణ, భూ వివాదాల పరిష్కారానికి రీ-సర్వే ప్రాధాన్యత గురించి వివరించారు.
రీ-సర్వే సమయంలో రైతులు తమకు సంబంధించిన భూ పత్రాలు, అవసరమైన రికార్డులను సిద్ధంగా ఉంచాలని, సర్వే బృందానికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. భూముల కొలతల సమయంలో ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీఆర్వోలు భూపతి, ప్రియాంక, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు రైతుల సందేహాలను నివృత్తి చేసి రీ-సర్వే విజయవంతానికి సహకరించాలని కోరారు.