-నాగలాపురం డివిజన్లో ఓ అధికారి తీరుపై మండిపడుతున్న రైతాంగం
కార్యాలయంలో అందుబాటులో లేని అధికారులు…?
నాగలాపురం, సెప్టెంబర్ 04 గరుడధాత్రి :
రైతులు విద్యుత్ సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నాగలాపురం డివిజన్ పరిధిలోని రైతులు ఆవేదన తీవ్ర వ్యక్తం చేస్తున్నారు. నాగలాపురం అదనపు డివిజనల్ ఇంజినీర్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సదరు అధికారి కార్యాలయంలో సక్రమంగా అందుబాటులో లేకపోవడం తో సమస్యలు పరిష్కారానికి వెసులుబాటు లేకుండా పోయింది.
విద్యుత్ కనెక్షన్లు, సాంకేతిక సమస్యలు, ఇతర ఫిర్యాదులతో కార్యాలయానికి వస్తున్న రైతులకు సకాలంలో స్పందన లభించడం లేదని వారు వాపోతున్నారు. చిన్నపాటి పనులకు సైతం డబ్బులు ఆశిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది రైతాంగ పట్ల చిన్నచూపు చూస్తుండటం, జావాబుదారీ తనం, ఖనీస మర్యాద లేకుండా వ్యవహరిస్తుండటం రైతులను మానసింగా తీవ్రంగా కృంగదీస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది.
-‘శ్రీసిటీ’ పనులపైనే ఆసక్తి?
ప్రజా సేవలకు సంబంధించిన విధుల కంటే శ్రీసిటీ పరిసరాల్లోని పనులపైనే అధికంగా దృష్టి సారిస్తున్నారు. మూడవ వ్యక్తి పేరుతో స్వంత కాంట్రాక్టు ను ఏర్పాటు చేసుకుని అక్కడే ..వ్యక్తిగత వాహనంలో తరచూ పర్యటిస్తూ ప్రైవేటు పనులను గుర్తించి ప్రత్యేక బృందంతో పనులు చేయిస్తున్నారనే జనం చెప్పుకుంటున్నారు.
దీనికారణంగా
ప్రభుత్వ అధికారి హోదాలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో కార్యాలయంలో అధికారి అందుబాటులో లేకపోవడంతో రైతులు, సామాన్య ప్రజలు పనుల కోసం పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిన్న, మధ్యతరహా రైతుల సమస్యలపై తక్షణ స్పందన లేకపోవడం వల్ల వారు మరింత ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటున్నారు.
-ఉన్నతాధికారులు స్పందించాలి
నాగలాపురం డివిజన్లో అదనపు డివిజనల్ ఇంజినీర్ పనితీరుపై వస్తున్న ఆరోపణలపై సంబంధిత ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. ఆరోపణల్లో వాస్తవమెంత? అనే విషయాన్ని తేల్చడంతో పాటు, ప్రభుత్వ విద్యుత్ సేవలు రైతులు, ప్రజలకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.