నాగలాపురం తహసిల్దార్ కార్యాలయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జూనియర్ అసిస్టెంట్ మునిరాజుపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల క్రితం మద్యం సేవించి కార్యాలయానికి హాజరైన ఘటనపై విచారణ నిర్వహించిన అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర ఐఏఎస్ గురువారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తహసిల్దార్ హనుమాన్ నాయక్ తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలలో క్రమశిక్షణ పాటించాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. విధి నిర్వహణ సమయంలో మద్యం సేవించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిన తరువాత కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.