GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 3:56 pm Posted by : GARUDA DHATRI NEWS

వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

*వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు*

*• నేడు స్వర్ణరథోత్సవం*

*• శేషాచలాన్ని తలపించిన శుక్ర‌వార‌పుతోట‌*

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం వైభ‌వంగా ప్రారంభమయ్యాయి. మే 1న ఉదయం ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.

వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల భక్తులకు శారీరక, మానసిక శాంతి లభిస్తుందని విశ్వాసం.

*వైభవంగా స్నపనతిరుమంజనం…*

వసంతోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 గంటల నుండి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.

*శేషాచలాన్ని తలపించిన శుక్ర‌వార‌పుతోట‌*

టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వార‌పు తోట‌లో శేషాచ‌లం అడవిని త‌ల‌పించేలా తీర్చిదిద్దారు. పచ్చని చెట్లు, పుష్పాలు, జంతువుల ఆకృతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆవు, దూడ, కోతి, నెమలి, హంసలు, చిలుకలు వంటి రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇందులో 300 కేజిల వ‌ట్టి వేరు, 500 కేజిల సాంప్ర‌దాయ పుష్పాలు, 15 వేల క‌ట్ ఫ్ల‌వ‌ర్స్‌తో వివిధ ర‌కాల ఫలాలు వినియోగించారు. ఇందులో బెంగళూరు, హైద‌రాబాద్‌కు చెందిన అలంకరణ నిపుణులు, టిటిడి సిబ్బంది ఇందుకోసం పనిచేశారు.

ఈ సంద‌ర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప‌న‌బాక ల‌క్ష్మీ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఏఈవో శ్రీ దేవ‌రాజులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు శ్రీ ముని చెంగ‌ల్రాయులు, శ్రీ ర‌మేష్‌, శ్రీ సురేష్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ చ‌ల‌ప‌తి, విశేష‌సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.