పలమనేరు, ఆగస్టు 09 (గరుడ ధాత్రి):
పలమనేరు పాతపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆషాడ మాస కామిక ఏకాదశిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. విష్ణుమూర్తికి, అమ్మవార్లకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పవిత్ర దినాన స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తే సూర్యలోక ప్రాప్తి సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కామిక ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి శాకంబరీ ఉత్సవాన్ని నిర్వహించారు. మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో వివిధ రకాల పచ్చి కూరగాయలతో సుందరమైన మాలలను తయారు చేయగా, అర్చకులు ఆ మాలలతో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామివారిని మనోహరంగా అలంకరించారు. అలాగే అనుబంధ ఆలయాలైన శ్రీ సీతా రామ లక్ష్మణ స్వామివార్లకు, అభయాంజనేయ స్వామివారికి కూడా వివిధ రకాల కూరగాయలతో శాకంబరీ అలంకరణ గావించారు. సాయంత్రం వేళ మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లలితా సహస్రనామ పారాయణం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం పఠించి, శ్రీలక్ష్మీ సమేత విష్ణుమూర్తికి అత్యంత భక్తిశ్రద్ధలతో లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు దివ్య మహా మంగళహారతులు సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆషాడ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తులు, మహిళలు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, మహిళా భక్తులు మరియు స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.