సత్యవేడు గంగమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, క్రైమ్ నియంత్రణ మరియు లా అండ్ ఆర్డర్ నిర్వహణపై పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు.
జాతర నేపథ్యంలో రేపటి నుండి 8 రోజులపాటు ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా 18వ తేదీ వరకు భారీ వాహనాలకు పూర్తిగా అనుమతి ఉండదని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకు ఉత్తుకోట-శ్రీసిటీ – పాలగుంట మార్గాల్లో ప్రత్యేక డైవర్షన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జాతర బందోబస్తులో భాగంగా ఇద్దరు సీఐలు, 11 మంది ఎస్ఐలు, 30 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 100 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించనున్నారు. అదనంగా శ్రీసిటీ నుండి 30 మంది సెక్యూరిటీ సిబ్బంది కూడా సహకరించనున్నారని పేర్కొన్నారు. భక్తుల భద్రత కోసం డ్రోన్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కూడా నిర్వహించనున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, మద్యం సేవించి గొడవలు చేయడం, గంజాయి మత్తులో హద్దులు దాటడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఇప్పటికే సమస్యాత్మకంగా ఉండే 20 మంది వ్యక్తుల జాబితా సిద్ధం చేసి ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు.
అదేవిధంగా జాతర సమయంలో వీధుల్లో పర్యవేక్షణ కోసం ఒక ఎస్ఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తారు. మొక్కులు తీర్చుకోవడానికి వేపాకు కట్టుకొని వచ్చే భక్తులకు ప్రత్యేక మార్గం, అలాగే దర్శనం కోసం వచ్చే భక్తులు క్యూ పాటించాలని పోలీసులు కోరారు.
ప్రజల సౌకర్యార్థం 24×7 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి సమస్యలు తలెత్తినా 100 లేదా 112కు కాల్ చేస్తే ఐదు నిమిషాల్లోనే పోలీసులు స్పందిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఎస్ఐ సాయినాథ్ చౌదరి, లేడీ ఎస్ఐ లావణ్య పర్యవేక్షిస్తారని చెప్పారు.
చివరగా గంగమ్మ జాతర సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ మురళి నాయుడు కోరారు