పలమనేరు, జూన్ 24 ( గరుడ ధాత్రి ) :
గంగవరం పంచాయతీ కార్యాలయం వద్ద సాయినగర్ పరిధిలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సు స్టాపుల బోర్డులను బుధవారం పలమనేరు ఆర్టీసీ డిపో మేనేజర్ అల్తాఫ్ బాషా ఘనంగా ప్రారంభించారు. ప్రయాణికులకు బస్సుల నిలుపుదలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఈ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ… పలమనేరు నుండి పుంగనూరు, మదనపల్లి వైపు వెళ్లే అన్ని ఆర్టీసీ బస్సులు ఇకపై గంగవరం పంచాయతీ కార్యాలయం ముందర ఆగుతాయని తెలిపారు. అదేవిధంగా, మదనపల్లి మరియు పుంగనూరు వైపు నుండి వచ్చే బస్సులు స్థానిక హీరో హోండా షోరూమ్ వద్ద నిలిపేలా బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని గమనించి, సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు పరిరక్షణ సమితి (పిపిఎస్) అధ్యక్షులు నరసింహలు, ప్రధాన కార్యదర్శి నారాయణ, కోశాధికారి రామచంద్ర మరియు కమిటీ సభ్యులు విజయ్కుమార్ రెడ్డి, శ్రీపురం సీతారామయ్య, రెడ్డెప్ప, జగన్నాథం, వెంకటేశ్వర్లు, విజయకుమార్, నాగయ్య, వీరభద్ర గౌడు, రవికుమార్, సుబ్రమణ్యం, సురేంద్ర, చంద్రశేఖరయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్థానికంగా బస్సు స్టాపుల బోర్డులు ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.