GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 8:56 pm Posted by : GARUDA DHATRI NEWS

సూపర్ సిక్స్ హామీలపై వైఎస్ఆర్సిపి నిరసన

-హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు

-టిడిపి మేనిఫెస్టో సూపర్ సిక్స్ బాండ్ పత్రాల దహనం
నాగలాపురం జూన్ 04 గరుడధాత్రి :
నాగలాపురం బజార్ వీధిలోని టవర్ క్లాక్ కూడలి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం సమీపంలో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా టిడిపి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన బాండ్ పత్రాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే ఎన్నికల హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.