-హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వీఆర్వో, వీఆర్ఏ
పిచ్చాటూరు గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం పరిధిలోని అంజేరమ్మ గుడి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రెవెన్యూ సిబ్బంది గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారిని ఓ కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గాయపడిన వారు పిచ్చాటూరు మండలానికి చెందిన వీఆర్వో జానకిరామయ్య, వీఆర్ఏ హేమంత్గా గుర్తించారు. వీరు కార్యాలయ పనుల నిమిత్తం తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అంజేరమ్మ గుడి సమీపంలో వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టినట్లు సమాచారం.
ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరు హెల్మెట్లు ధరించి ఉండటంతో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుంది అనే విషయానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.