GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 7:39 pm Digital Edition : GURU SWAMY

శాస్త్రోక్తంగా శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

శాస్త్రోక్తంగా శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

నాగలాపురం, ఏప్రిల్ 28, (గరుడధాత్రి న్యూస్)

నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో మే 1 నుండి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుధ్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 12 గంటల‌ వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగ‌ర‌త్న‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ‌నివాసులు, చెంగ‌ల్రాయులు, ఆల‌య‌ అర్చకులు పాల్గొన్నారు.