* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం.
* కుప్పం ఆర్టీసీ బస్టాండ్లో తనిఖీలు నిర్వహణ.
కుప్పం,జులై 25 (గరుడ ధాత్రి న్యూస్): ప్రజల సంతృప్తి లక్ష్యంగా ఆర్టీసీ సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి. ఎస్. మునిరత్నం ఆదేశించారు. శనివారం కుప్పం ఆర్టీసీ డిపో ప్రాంగణాన్ని, బస్టాండ్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పాజిటివ్ పీపుల్ పర్సెప్షన్ కార్యక్రమంలో భాగంగా వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ను మరోసారి ఆకస్మికంగా సందర్శించి వివిధ ఏర్పాట్లను పరిశీలించారు.గత సోమవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో బస్టాండ్లోని పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై పలు సూచనలు చేసిన నేపథ్యంలో, సంబంధిత అధికారులు చేపట్టిన చర్యల ఫలితంగా ప్రస్తుతం బస్టాండ్లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, క్యాంటీన్ నిర్వహణతో పాటు మొత్తం వాతావరణంలో గణనీయమైన మెరుగుదల కనిపించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణ పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, క్యాంటీన్ సేవలు, తాగునీటి వసతులు, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, బస్సుల సమయపాలన తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రయాణికులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకుని సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సంతృప్తే ప్రభుత్వ పనితీరుకు నిజమైన కొలమానమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన, సమయపాలనతో కూడిన ఆర్టీసీ సేవలను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.