GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 7:58 pm Posted by : GURU SWAMY

ఘోర తపస్సుతో పాశుపతాస్త్రాన్ని పొందిన అర్జునుడు

తపస్సుతో శివపార్వతులను మెప్పించిన అర్జునుడు

రామచంద్రాపురం,జూలై 22: రాబోవు కురుక్షేత్రంలో విజయం సాధించడానికి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ పనిలో పనిగా ఘోర తపస్సుతో శివపార్వతులను మెప్పించి అత్యంత మహిమ కలిగిన పాశుపతాస్త్రాన్ని సంపాదించటమే అర్జున తపస్సు. శ్రీ వెంకటేశ్వర కళానాట్యమండలికి చెందిన భాస్కర్ అర్జున పాత్ర దారుడిగా,లక్ష్మయ్య శివుడి పాత్రధారిగా, పార్వతి గా ధనలక్ష్మి చక్కగా పాత్రలలో లీనమై కార్యక్రమాన్ని ప్రదర్శించారు. ఇంద్రకీలాద్రిపై అర్జునుడు పాశుపతాత్రాన్ని సంపాదించడానికి శివుని గురించి తపస్సు చేయటం,తపస్సుకు మెచ్చి శివుడు పార్వతిని వెంటబెట్టుకొని అర్జునుడిని పరీక్షించటానికి ఇంద్రకీలాద్రి కి చేరుకోవటం, అర్జునుడు తన బాణంతో ఓ వరాహాన్ని సంహరించటం అదే సమయంలో శివుడు కూడా ఆవరాహంపై బాణాన్ని సందించడం, ఆ పందిని తాను చంపానని అర్జునుడు తాను చంపానని శివుడు పోట్లాడటం శివుని ధాటికి అర్జునుడు మూర్చ నొందటం, ఎప్పటినుంచో చూడాలనుకుంటున్న పార్వతికి అర్జునుడి వీపు పైన ఉన్న విజయానికి చిహ్నమైన వింజమూర్లను శివుడు చూపటం, అర్జునుడి భక్తికి మెచ్చి హస్తాన్ని శివుడు ప్రసాదించటం వంటి సన్నివేశాలను శివార్జునుల పాత్రధారులు ప్రేక్షకులకు చక్కగా ప్రదర్శించి చూపారు. అర్జున పాత్రధారి తపస్సు మానును అధిరోహిస్తూ మెట్టు మెట్టుకు ఒక శివ స్తోత్రాన్ని ఆలాపించారు. పలువురు సంతానం లేని వివాహితులు సంతానం కోసం వివాహం కానీ యువతులు వివాహం కోసం చన్నీటిలో స్నాన ఆచరించి తడి బట్టలతో తపస్సుమానుచుట్టు వరపడ్డారు. వారందరికీ అరటి జామ నిమ్మ విభూది పండ్లతో పాటు బిల్వ పత్రాలను ప్రసాదంగా తపస్సు మాను నుంచి అర్జున పాత్రధారి విసిరారు. ప్రసాదాన్ని చేజిక్కించుకోవడానికి పలువురు పోటీలు పడ్డారు.అర్జున తపస్సు కార్యక్రమానికి తిరుపతికి చెందిన గాలి వేణుగోపాల్ నాయుడు,ఆనందమ్మ కుటుంబ సభ్యులు పవన్ కుమార్ లావణ్య,జీవన్ కుమార్ దివ్య దంపతులు ఉభయ దారులుగా వ్యవహరించారు. మూడు పూటలా నిలువు రాళ్ల కమ్మపల్లి గ్రామానికి చెందిన నాదెళ్ల కుమారస్వామి నాయుడు, చంద్రరేఖ కుటుంబ సభ్యులు
నాదెళ్ల నర్సింహులు నాయుడు, నాగ మునెమ్మల జ్ఞాపకార్థం భక్తులకు అన్న ప్రసాద వితరణ గావించారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు:

అర్జున తపస్సు కార్యక్రమ నేపథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు హరి స్వామి, అర్చకులు అరవింద ఆచారి, దివంగత అర్చకులు బ్రహ్మశ్రీ వెంకటరత్నం ఆచారి దివ్య ఆశీస్సులతో పూజా ద్రవ్యాలను ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ తపస్సు కార్యక్రమంలో వాడిన పూజా ద్రవ్యాలను పంబల మేళాలతో ప్రదక్షిణ చేయించి తపస్సు వేదిక వద్దకు తీసుకుని వెళ్లారు. మంత్ర జలాన్ని తపస్సు ప్రాంగణంలో పులకరింపజేసి అష్టదిక్పాలకులకు అభివాదం చేసి తపస్సు మానును నిలబెట్టారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. భాగవతారాణి స్వర్ణలత అర్జునుడు ఎందుకు తీర్థయాత్రలకు వెళ్లాల్సి వచ్చిందో ఇంద్రకీలాద్రిలో ఏ విధంగా తపస్సు చేసి శివుని మెప్పించాడో వంటి సన్నివేశాలను చక్కటి గాత్రంతో గానం చేశారు.రాత్రి శ్రీ వెంకటేశ్వర కళానాట్యమండలి వారు పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళటం సందర్భాన్ని పౌరాణిక నాటకంగా ప్రదర్శించారు.

చక్కటి సౌకర్యాల కల్పన: ఆలయ ధర్మకర్తలు రమేష్ బాబు రవికుమార్ లు
స్థలదాత దివంగత సంపత్ పిళ్లై ఆశీస్సులతో ఉత్సవ ప్రాంగణమంతా గ్రామస్తులతో కలిసి చక్కటి సౌకర్యాలను కల్పించారు.రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఎప్పటికప్పుడు ఆలయంలో ఆలయ పరిసరాలలో పారిశుద్ధ్యన్ని చక్కగా నిర్వహించారు.స్వామి వారి శిష్య బృందం, గణాచార్యులు,భటాచార్యులు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తూ తీర్థ ప్రసాదాలు అందించారు. గురువారం రాత్రి మహాభారతంలో ప్రముఖ ఘట్టంలో ఒకటైన కీచక వధ నాటకం ఉంటుందని కార్య నిర్వహకులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు.