GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 7:23 pm Posted by : GURU SWAMY

పగిలిన తాగునీటి పైప్‌లైన్… దుమ్ము, ధూళి కలిసిన నీరే ప్రజలకు సరఫరా

పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి తీరుపై టి.పి.కోట గ్రామ ప్రజల ఆగ్రహం.
నాగలాపురం, గరుడ దాత్రి జూలై 20:
నాగలాపురం మండల పరిధిలోని టి.పి. కోట గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలోని ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై ఉన్న తాగునీటి పైప్‌లైన్ పగిలి ఉండటంతో, పైప్‌లోకి దుమ్ము, ధూళి, మురుగు చేరుతున్నప్పటికీ అదే నీటిని గ్రామంలోని ఓవర్‌హెడ్ ట్యాంకుకు పంపించి ప్రజలకు సరఫరా చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకల కారణంగా ఎగిసిపడుతున్న దుమ్ము, మట్టి పగిలిన పైప్ ద్వారా నీటిలో కలుస్తున్నాయని, దీంతో ప్రజలు కలుషిత నీటిని తాగాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి సమస్య తెలిసినా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు. కలుషిత నీటి వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, వెంటనే పగిలిన పైప్‌లైన్‌ను మరమ్మతు చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.