తడ ఆగస్టు 09 గరుడధాత్రి :
తడ మండలం అనపగుంట గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్ దెయ్యాల కిరణ్ హామీ ఇచ్చారు.
అనపగుంట గ్రామంలో పర్యటించిన దెయ్యాల కిరణ్ స్థానిక ప్రజలతో కలిసి గ్రామంలోని ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా త్రాగునీటి సమస్య, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కొరత, పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు తదితర అంశాలపై ప్రజలతో చర్చించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా దెయ్యాల కిరణ్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తానన్నారు. అనపగుంట గ్రామ ప్రజలకు అండగా ఉంటామని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తడ మండల ఉపాధ్యక్షుడు చంద్రారెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆవల రమణ, కిషన్ మోర్చా అధ్యక్షుడు జోగి వినోద్, మహిళా అధ్యక్షురాలు శ్వేత, తిరుపతి జిల్లా అడ్వకేట్ విభాగం నాయకులు మధుకర్ బాబు, తడ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పూజారి లోకేష్, కాంగ్రెస్ పార్టీ తడ మండల నాయకుడు బాబు తదితరులు పాల్గొన్నారు.