GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 8:49 pm Posted by : GURU SWAMY

విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో కీలకం -మాజీ ఏఎంసీ చైర్మన్ ఇలంగోవన్ రెడ్డి

పిచ్చాటూరు జూలై 24 గరుడధాత్రి :

పిచ్చాటూరు మండలం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు ఇలంగోవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. పిల్లల విద్యాభివృద్ధిపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ చూపడంతో పాటు, వారి ప్రవర్తన, అభ్యాస సామర్థ్యం, లక్ష్యాలపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పనిచేయాలని కోరారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, అందుబాటులో ఉన్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఇలంగోవన్ రెడ్డి పిలుపునిచ్చారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన అంశాల్లో తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, పరీక్షల ఫలితాలు, క్రమశిక్షణ, ఉన్నత విద్య అవకాశాలపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చించి పలు సూచనలు చేశారు. పిల్లల ప్రతిభను వెలికితీసేందుకు కుటుంబం-పాఠశాల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని వివరించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.