*మైదుకూరు ఉద్యానశాఖ అధికారి సి. రామకృష్ణ వెల్లడి
గరుడ దాత్రి న్యూస్ మైదుకూరు, జులై:25
మండల వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న దృష్ట్యా, తోటలను కాపాడుకునేందుకు ఉద్యాన శాఖ ద్వారా ఫార్మ్ పాండ్లు (వ్యవసాయ కుంటలు), వీడ్ మాట్ల ఏర్పాటుకు ప్రభుత్వం భారీగా రాయితీలు అందిస్తోందని మైదుకూరు ఉద్యానశాఖ అధికారి సి. రామకృష్ణ తెలిపారు. శనివారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు.
రాయితీల వివరాలు:
వ్యక్తిగత ఫార్మ్ పాండ్లు: 20×20×3 మీటర్ల కొలతలతో నిర్మించుకునే కుంటలకు రూ. 1,80,000 ఖర్చవుతుండగా, ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ కింద రూ. 90,000 అందిస్తోంది.
కమ్యూనిటీ (సామూహిక) ఫార్మ్ పాండ్లు: రైతులు గ్రూప్గా ఏర్పడి 100×100×3 మీటర్ల విస్తీర్ణంలో నిర్మించుకునే సామూహిక కుంటలకు అయ్యే రూ. 24,00,000 వ్యయంలో ఏకంగా 75 శాతం సబ్సిడీగా రూ. 18,00,000 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ఇస్తుందన్నారు.
వీడ్ మాట్ కలుపు నివారణ మ్యాట్ బత్తాయి, నిమ్మ, మామిడి, దానిమ్మ తోటల్లో నీటి ఆవిరిని అరికట్టేందుకు, కలుపు నివారణకు వీడ్ మాట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చదరపు మీటరుకు అయ్యే రూ. 50 వ్యయంలో ఉద్యాన శాఖ 50 శాతం (రూ. 25) రాయితీ ఇస్తోందన్నారు. ఈ వెసులుబాటు ఒక్కో రైతుకు గరిష్టంగా 4,000 చదరపు మీటర్ల విస్తీర్ణానికి వర్తిస్తుందని చెప్పారు.
కావలసిన ధ్రువపత్రాలు:
ఈ పథకాల ప్రయోజనం పొందాలనుకునే అర్హులైన రైతులు తమ సమీప గ్రామ రైతు సేవా కేంద్రాల్లో పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డ్, 1-B, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలని ఉద్యాన అధికారి కోరారు.