నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటన ఏర్పాట్లు.
మహిళల్లో చైతన్యానికి మహిళలతో ముఖాముఖి కార్యక్రమాలు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు.
మాట ప్రకారం మూడు నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి.
కుప్పం,జులై 21 (గరుడ ధాత్రి న్యూస్):
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ పర్యటన ఏర్పాట్లు జోరుగా చేపడుతున్నారు. ఈనెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. 26వ తేదీ సాయంత్రం కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం పరిధిలోని కడపల్లె వద్ద ఉన్న సొంత ఇంటికి చేరుకుంటారు. 27వ తేదీన రామకుప్పం మండలంలో పర్యటిస్తారు. 28వ తేదీన గుడిపల్లి మండలంలో 29వ తేదీన కుప్పం మండలంలో పర్యటిస్తారు. 30వ తేదీన కుప్పం మున్సిపాలిటీ పరిధిలో నారా భువనేశ్వరి పర్యటిస్తారు. ఈ పర్యటనలో నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాకుండా మహిళలతో ప్రత్యేకంగా సమావేశాల్లో పాల్గొని మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. గతంలో కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గం పర్యటనల సందర్భంగా నియోజకవర్గంలోని వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. మహిళలతో ముఖాముఖి సందర్భంగా మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కుట్టు మిషన్లు, తోపుడుబండ్లు, వినికిడి యంత్రాలు వంటివి అర్హులకు అందించే సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు.