GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 8:58 pm Digital Edition : GURU SWAMY

హంస వాహ‌నంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ సౌమ్యనాథస్వామి అనుగ్ర‌హం

గరుడ దాత్రి న్యూస్ తిరుపతి / నందలూరు జూలై 23:: నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం రాత్రి హంస వాహ‌నంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ సౌమ్యనాథస్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్ర‌హించారు.
భక్తుల గోవింద నామస్మరణ, చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన వాహనసేవ ఆధ్యాత్మిక పరవశాన్ని నింపింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.
హంస వాహనసేవలో శ్రీ సౌమ్యనాథస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే స్వామివారు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
అదేవిధంగా జూలై 24వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప‌ల్ల‌కీ ఉత్స‌వం, రాత్రి 7 గంట‌ల‌కు సింహ వాహ‌నాల‌పై స్వామివారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.
ఈ వాహనసేవలో ఆలయ ఏఈవో శ్రీ రవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.