GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 1:01 pm Posted by : GURU SWAMY

ఆధ్యాత్మిక కేంద్రంగా కుప్పం ప్రగతికి చర్యలు

* టూరిజం అభివృద్ధికి చంద్రబాబు ప్రత్యేక కృషి.
* గుడిపల్లి మండలంలో దేవాలయం సందర్శన.
* ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం.
కుప్పం,జులై 26 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్.మునిరత్నం అన్నారు. ఆదివారం గుడిపల్లి మండలం యామనూరు గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ నెల 28వ తేదీన సీఎం సతీమణి నారా భువనేశ్వరి పర్యటన సందర్భంగా ధర్మరాజు దేవాలయంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మండల నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,కుప్పం నియోజకవర్గంలోని 130 దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అన్ని రంగాలలో కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా కుప్పం నియోజకవర్గంను ఆధ్యాత్మిక పరంగా కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో కోట్లాది రూపాయల నిధులతో ప్రభుత్వం పలు దేవాలయ నిర్మాణాలను చేపట్టిందన్నారు. ననియాల వద్ద ఎకో టూరిజం అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. యామనూరు ధర్మరాజు దేవాలయం వద్ద ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న సమావేశం విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లను సమీక్షించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్. చంద్రశేఖర్, గుడిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుబ్రమణి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు రవి, యామునూరు శ్రీనివాసులు, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.