రామచంద్రపురం జూలై 24గరుడధాత్రి న్యూస్ :
ప్రభుత్వ ఆదేశాల మేరకు రామచంద్రాపురం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెగా పి టి యం 4.0 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు. మండలంలోని మిట్టూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎంఈఓ మార్కండేయనాయుడు పాల్గొన్నారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులు ఉపాధ్యాయులు పుష్పాలు అందించి ఘన స్వాగతం పలికారు. తల్లి తండ్రులకు మిఠాయిలను అందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మార్కండేయ నాయుడు మాట్లాడుతూ గత రెండు రోజులుగా ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఒక్క విద్యార్థి తల్లి అకౌంట్లో 13 వేల రూపాయలు జమ చేయడం జరుగుతున్నదన్నారు. ఎవరికైతే డబ్బులు అకౌంట్ లో జమ కాలేదు వారు గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ దగ్గరకు వెళితే వాళ్ళకి కావాల్సిన పత్రాలను అందిస్తే డబ్బులు అకౌంట్ లో పడతాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిరోజు సాయంత్రం తమ పిల్లలు దగ్గర కొద్దిసేపు సమయం కేటాయించి వారు ఎలా చదువుకుంటున్నారు జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. తల్లితండ్రులు కూడా పాఠశాలకు వచ్చి పాఠశాల వాతావరణం, భోజనం ఎలా ఉందో చూసి ఏమైనా పొరబాట్లు ఉంటే ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు. అనంతరం పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులకు రుచికరమైన భోజనం అందించారు.