GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 5:03 pm Digital Edition : GURU SWAMY

ఏళ్ల కల సాకారం చేసిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి

పలమనేరు – మాదిగబండ బస్సు సర్వీస్ ప్రారంభం

ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించిన విద్యార్థులు, మహిళలు

ప్రజా సంక్షేమమే పరమావధి… గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే

పలమనేరు, జులై 25 ( గరుడ ధాత్రి ) :

పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ పరిధిలోని మాదిగబండ గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కల నేడు సాకారమైంది. స్థానిక ప్రజల చిరకాల విజ్ఞప్తికి స్పందించిన పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి కృషితో పలమనేరు – మాదిగబండ బస్సు సర్వీస్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామస్తులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మాట్లాడుతూ,….ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి, ప్రభుత్వ సేవల కోసం సులభంగా రాకపోకలు సాగించేలా రవాణా సౌకర్యాల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
మాదిగబండ గ్రామానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యను గుర్తించి సంబంధిత అధికారులతో పలుమార్లు చర్చించి బస్సు సర్వీస్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సౌకర్యంతో గ్రామ ప్రజల ప్రయాణ కష్టాలు తీరడంతో పాటు విద్యార్థులు విద్యాసంస్థలకు, ప్రజలు తమ దైనందిన అవసరాలకు సులభంగా చేరుకోగలరని అన్నారు.”ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ పరమావధి. గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తాం. ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లవుతుంది” అని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి స్పష్టం చేశారు.

అనంతరం మాదిగబండ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే పరిశీలించి ఉరుస్తున్న భవనానికి వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను అయన ఆదేశించారు. బస్సు సర్వీస్ ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు, విద్యార్థులు, మహిళలు తమ ఎన్నో ఏళ్ల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, ఆర్టీసీ డిపో మేనేజర్ అల్తాఫ్, పీఏసిఎస్ చైర్మన్ లు పెద్దబ్బ, వెంకటముని రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజు రెడ్డి, గణేష్, సెల్వ రాజ్, మంజులమ్మ, రామూర్తి నాయుడు, హేమ సుందరం, రత్నప్పా, భాస్కర్, లక్ష్మి నారాయణ తదితరులు ఉన్నారు..