సమన్వయంతో పని చేసి వందశాతం విజయం సాధించాలి
సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయాలి
ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకే 27 నుంచి “ఇంటింటికి” కార్యక్రమం
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశంలో నాయకులకు ఎమ్మెల్యే అమర్ దిశా నిర్దేశం
పలమనేరు, జులై 24 ( గరుడ ధాత్రి ) : సంస్థాగత ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సూచించారు. పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం, ఇంటింటికి కార్యక్రమం, పార్టీ బలోపేతం వంటి అంశాలపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… రానున్న సంస్థాగత ఎన్నికలను ప్రతి నాయకుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాలకు తావివ్వకుండా పార్టీ విజయం ఒక్కటే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు సాగితే వందశాతం విజయాన్ని సాధించగలమని అన్నారు. పార్టీ బలపడితేనే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 27 నుంచి “ఇంటింటికి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ విజయాలు, ప్రజలకు అందుతున్న లబ్ధిని వివరించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను వినడం, పరిష్కరించడం ద్వారానే ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయవచ్చని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.