GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 7:42 pm Digital Edition : GURU SWAMY

ఇసుక అక్రమ రవాణా, నిల్వపై పలమనేరు పోలీసుల ఉక్కుపాదం : ఒకరి అరెస్ట్, ట్రాక్టర్ స్వాధీనం

పలమనేరు, ఆగస్టు 09 ( గరుడ ధాత్రి ) :
ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ, నిల్వ ఉంచుతున్న ఒక వ్యక్తిని పలమనేరు అర్బన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…ఆదివారం అర్బన్ సీఐ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది పట్టణంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో లక్ష్మినగర్ కాలనీ, ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీపంలోని ఒక ఖాళీ స్థలంలో ట్రాక్టర్ ద్వారా ఇసుకను అక్రమంగా దింపుతుండగా పోలీసులు దాడి చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ వ్యక్తి పలమనేరు మండలం టి. వడ్డూరు గ్రామానికి చెందిన గంగవరం రాజు (52)గా గుర్తించారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గంగవరం మండల పరిధిలోని కౌండిన్య నది నుండి ఇసుకను తోడి, ట్రాక్టర్ ద్వారా పలమనేరుకు తరలించి నిల్వ చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. అతని వద్ద నుంచి ఇసుక రవాణాకు ఉపయోగించిన ట్రాక్టర్‌తో పాటు, అక్కడ నిల్వ ఉంచిన సుమారు ఐదు ట్రాక్టర్ల లోడ్ల ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తవ్వడం, రవాణా చేయడం లేదా అక్రమంగా నిల్వ చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. మండలంలో ఎవరైనా అక్రమ ఇసుక వ్యాపారానికి పాల్పడితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.