గరుడధాద్రి న్యూస్ మైదుకూరు, జులై 19:
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు రహదారిపై వెళ్లే అమాయకుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని మైదుకూరు అర్బన్ పోలీస్ ఇన్స్పెక్టర్ కె. రమణా రెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, మైదుకూరు డీఎస్పీ శ్రీ జి. రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో ఆదివారం పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ రమణా రెడ్డి వాహనదారులకు పలు కీలక సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని స్పష్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలను ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలని సూచించారు. మితిమీరిన వేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడటం వంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే భారీ జరిమానాలు తప్పవన్నారు. పట్టణంలో రహదారి భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని సీఐ రమణా రెడ్డి కోరారు.