GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 7:42 pm Digital Edition : GURU SWAMY

భయంకరంగా ఏనుగుల స్వైరవిహారం.. రూ.లక్షల్లో రైతులకు పంట నష్టం

గరుడధాత్రి న్యూస్ :
అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలం జిల్లేళ్లమంద సమీప అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచారం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నాలుగైదు రోజులుగా సంచరిస్తున్న గజరాజులు శేషాచలం సమీపంలోని మామిడి, కొబ్బరి, అరటి తోటలపై దాడి చేసి భారీ నష్టం కలిగించాయి. మామిడి, కొబ్బరి చెట్లను నేలమట్టం చేయడంతో పాటు సాగునీటి పైపులు, కంచెలు, రాతి కూసాలను ధ్వంసం చేశాయి. జిల్లేళ్లమంద గ్రామానికి చెందిన సుమారు 20 మంది రైతులు రూ.లక్షల్లో నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ పొలాల వద్దకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నామని రైతులు చెబుతున్నారు. ఏనుగుల బెడదను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.