GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 7:45 pm Digital Edition : GURU SWAMY

అలరించిన దుర్యోధన వధ

రామచంద్రాపురం: మండలంలోని నూతిగుంటపల్లి శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో గత 11 రోజులుగా జరుగుతున్న మహాభారత ఉత్సవాలు ఆదివారం దుర్యోధన వధ ఘట్టంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా కీలకమైన దుర్యోధన వధ నాటక ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. భీమసేనుడిగా బాలాజీరెడ్డి, గంటావారి పల్లె, దుర్యోధనుడిగా బంగారు పాల్యం గోవిందరాజులు , వేషదారులు తమ అద్భుతమైన అభినయంతో హావభావాలతో, తమ గాత్రంతో పద్యాలాపనతో పాత్రలకు ప్రాణం పోశారు.ప్రాణ భయంతో దుర్యోధనుడు గంగమడుగులో దాక్కోవడం, భీముడు తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అతడిని బయటికి రప్పించడం, ఆపై గదా యుద్ధంలో దుర్యోధనుడిని హతమార్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అనంతరం ఉపవాస దీక్షలతో, కంకణదారులైన భక్తులు ఏడు బావుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, గోవింద నామస్మరణ చేస్తూ అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి ఆధ్వర్యంలో ద్రౌపదీ మాతను స్మరిస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తుల గోవింద నామస్మరణతో పరిసరాలు మారుమోగాయి. ఈ సందర్భంగా మహాభారత ఉత్సవాలు సహకరించిన అనుపల్లి, కొత్త వేపకుప్పం, గంగుడుపల్లి, గ్రామాల ప్రజలకు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.