చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ వర్మ
నందమూరి కుటుంబీకులతో పాటు హాజరైన ప్రముఖులు
సనాతన ధర్మ విలువలను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తానన్న చైర్మన్ శ్రీధర్ వర్మ
పలమనేరు, ఆగస్టు 22 (గరుడ ధాత్రి ) : తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో శనివారం ఎస్వీబీసీ చైర్మన్గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి తారక రామారావు తనయులు నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణతో పాటు వారి కుటుంబ సభ్యులు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్గా సేవలందిస్తున్న శ్రీధర్ వర్మ ఎస్వీబీసీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారానికి ముందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ వర్మకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి ఎస్వీబీసీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, నందమూరి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించడంలో ప్రత్యేకంగా సహకరించిన మాజీ మంత్రి, పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్వీబీసీ ద్వారా సనాతన ధర్మ విలువలు, ఆధ్యాత్మిక సందేశాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని శ్రీధర్ వర్మ తెలిపారు. భక్తులకు మరింత మెరుగైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందించడంతో పాటు సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. శ్రీధర్ వర్మ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేసి భవిష్యత్ సేవలకు శుభాకాంక్షలు తెలిపారు.
