నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్సై తేజస్విని
కార్వేటినగరం, సెప్టెంబర్ 13 గరుడదాత్రి:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని ప్రతి గ్రామంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కార్వేటినగరం ఎస్సై తేజస్విని సూచించారు.
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా డీజేలు, పాటకచేరీలు, అశ్లీల నృత్యాలు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే ఎవరైనా డీజేలు లేదా ఇతర కార్యక్రమాల కోసం ముందస్తుగా అడ్వాన్స్ చెల్లించి ఉంటే, ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు.
పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి డీజేలు, అశ్లీల నృత్యాలు లేదా అనుమతి లేని కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తేజస్విని హెచ్చరించారు.
ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతమైన, భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని ఆమె కోరారు.
