సూళ్లూరుపేట రాజకీయాల్లో నూతన అధ్యయనం.. ఐడీజేఎన్ జిల్లా అధ్యక్షుడి వైపు ప్రజల చూపు !
అవినీతిపై అక్షర సమరం.. ప్రజా సమస్యల పరిష్కారమే ఊపిరిగా పోరాటం
సూళ్లూరుపేట (గరుడ దాత్రి) జూలై 23:
ఏ సమాజంలోనైనా మార్పు అనేది ఒక రాత్రికి రాత్రే రాదు. ఆ మార్పు కోసం నిజాయితీగా ఉద్యమించే నాయకుడు ప్రజాక్షేత్రం నుంచే రూపుదిద్దుకుంటాడు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా, ప్రజా సమస్యలే ప్రాతిపదికగా అహరహం శ్రమిస్తున్న వ్యక్తిత్వం దయ్యాల కిరణ్ కుమార్. తిరుపతి జిల్లా ఐడీజేఎన్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్, పాత్రికేయుడిగానే కాక సామాజిక కార్యకర్తగా సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
ప్రస్తుతం సూళ్లూరుపేట నియోజకవర్గం ఒక రాజకీయ పరివర్తన వైపు అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయిలో సమస్యలపై నిలదీసే కొత్త తరం నాయకత్వం కోసం నియోజకవర్గ ప్రజలు, యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో దయ్యాల కిరణ్ కుమార్ పేరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అవినీతిపై ‘కలం’పోటు – నిరంతర అక్షర సమరం:
పాత్రికేయ రంగాన్ని ఒక బాధ్యతగా స్వీకరించిన కిరణ్ కుమార్, అక్రమాలు, అవినీతిపై ఎప్పటికప్పుడు నిర్భయంగా వార్తలు రాశారు. అధికార యంత్రాంగంలోని లోపాలను, ప్రజాధనం దుర్వినియోగాన్ని వెలుగులోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేశారు. ఐడీజేఎన్ జిల్లా అధ్యక్షుడిగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం పోరాడుతూనే, సమాజ హితమే పరమావధిగా వ్యవహరించారు.
ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరాటం:
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడ కిరణ్ కుమార్ ప్రత్యక్షమవుతారు. సమస్యలను కేవలం వార్తలకే పరిమితం చేయకుండా, అవి పరిష్కారమయ్యే వరకు అధికారులను నిలదీస్తూ వెంటపడటం ఆయన శైలి.
తాగునీటి ఇబ్బందులు:
మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో తాగునీటి ఎద్దడిపై స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య నివారణకు కృషి చేశారు.
రహదారుల పునర్నిర్మాణం:
ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారిన రహదారుల మరమ్మతుల కోసం ఆందోళనలు చేపట్టి, ఉన్నతాధికారులను ఒప్పించి పనులు జరిగేలా చూశారు.
సంక్షేమ పథకాల పారదర్శకత: అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా స్థానిక లోపాలను ఎత్తిచూపారు.
విద్యార్థులకు చేయూత – సామాజిక సేవలు:
సామాజిక బాధ్యతలో భాగంగా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమయ్యే ప్రమాదంలో ఉన్న పదో తరగతి, ఉన్నత విద్య అభ్యసించే పేద విద్యార్థులకు పుస్తకాలు, పరీక్ష రుసుములు, స్టడీ మెటీరియల్ అందించి ప్రోత్సహించారు. నియోజకవర్గంలో ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు, అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి తనవంతు చేయూతనిచ్చారు.
“సామాజిక మార్పు కోసం కలం పట్టిన రోజు నుంచి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారమే నా ఊపిరిగా పనిచేస్తున్నాను. ప్రజల మద్దతు, వారి అభిమానమే నాకు శ్రీరామరక్ష.”
-దయ్యాల కిరణ్ కుమార్, తిరుపతి జిల్లా ఐడీజేఎన్ అధ్యక్షుడు.
రాజకీయాల్లోకి రావాలని స్థానికుల ఆకాంక్ష:
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దయ్యాల కిరణ్ కుమార్ లాంటి ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన, నిజాయితీ ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు, మేధావులు, యువత కోరుకుంటున్నారు. జర్నలిస్టుగా సమాజంలోని ప్రతి సమస్యను లోతుగా పరిశీలించిన అనుభవం ఆయనకు ఉందని, ప్రజా ప్రతినిధిగా వస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలరని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ ప్రయాణం ఎలాంటి మలుపు తిరుగుతుందోనని స్థానికంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.
