పిచ్చాటూరు, జూలై 24:
*విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పాఠశాల విద్యే బలమైన పునాదిగా నిలుస్తుందని పులికుండ్రం ఎంపీటీసీ రమేష్ రాజు అన్నారు.పిచ్చాటూరు మండలం పులికుండ్రం జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీటీసీ రమేష్ రాజు విద్యార్థులు, తల్లిదండ్రులు,ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ఇద్దరూ సమన్వయంతో పనిచేస్తేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, ఆ అవకాశాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో చదివితే జీవితంలో విజయాలు సాధించవచ్చని ప్రోత్సహించారు.ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
