తిరుపతి, జూలై 27 : రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు..
సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫిరెన్స్ హాలు నందు జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి) జరిగిన సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సింగిల్ డెస్క్ విధానంలో మే 2026 జూలై 2026 వరకు 178 పరిశ్రమలకు గాను 124 అనుమతులు ఇచ్చామని మరో 54 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పరిశ్రమలు పరిశీలన కమిటీకి అందిన మేరకు 11 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రూ. 2.92 కోట్లు అందించడానికి నేడు ఆమోదం తెలిపారు. పెట్టుబడి సబ్సిడీ 9 ,విద్యుత్ సబ్సిడీ 1, వడ్డీ రాయితీ 1, యూనిట్లకు ఆమోదించారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ప్రింటింగ్ క్లస్టర్, తిరుపతి, కలంకారీ క్లస్టర్, శ్రీకాళహస్తి, నారాయణవనం పవర్ లూమ్ క్లస్టర్, ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్, తిరుపతి ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించి వేగవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు వివరిస్తూ నారాయణవనం పవర్ లూమ్ క్లస్టర్ మరియు ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్, తిరుపతి రాష్ట్ర స్థాయి ఆమోదం పొంది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కొరకు పంపారని తెలిపారు.
పరిశ్రమలకు సంబందించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఏపిఐఐసి ద్వారా భూమి కేటాయించబడిన పరిశ్రమలు వివిధ దశలలో వున్నాయని,ఇంకా ప్రారంభించని వాటిని త్వరిత గతిన ప్రారంభించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఇంచార్జి మునిసిపల్ కమీషనర్ శారదా దేవి, జోనల్ మేనేజర్ ఏపిఐఐసి తిరుపతి విజయ భరత్ రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, డిపిఓ సుశీలా దేవి, డి ఆర్ డి ఏ పిడి శోభన్ బాబు, కార్మిక శాఖ అధికారి, చిన్న లాల్లప్ప, ఆర్ అండ్ బి ఎస్ సి రాజా నాయక్, ఎల్ డి ఎం రవి కుమార్, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ మురళి కృష్ణ, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, లోకనాధం, మార్కెటింగ్ అధికారి సురేంద్ర బాబు, పొల్యూషన్ కంట్రోల్ అధికారి రాజశేఖర్, సంబంధిత జిల్లా అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
RELATED ARTICLES
