జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
* *ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ పనుల పురోగతిపై సమీక్ష*
గరుడ దాత్రి న్యూస్ న్యూస్ కడప, జూలై 27: యువతలో ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తిని పెంపొందించి, ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్మిస్తున్న “స్టార్ట్ అప్ కడప” ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనుందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో.. పి-4 విధానం ద్వారా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న “స్టార్ట్ అప్ కడప” నిర్మాణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన తో కలిసి సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. “ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్ట్ అప్” అనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా జిల్లా యంత్రాంగం వినూత్నంగా ఈ కేంద్రాన్ని రూపొందిస్తోందన్నారు. యువతలో సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం అందిస్తూ, కొత్త వ్యాపారాలకు మార్గనిర్దేశం చేసే కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంటోందని చెప్పారు.
అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, కో-వర్కింగ్ స్పేస్లు, శిక్షణా కేంద్రాలు, సమావేశ మందిరాలు, వ్యాపార సలహా సేవలు వంటి అన్ని మౌలిక వసతులతో నిర్మితమవుతున్న ఈ కేంద్రం ద్వారా స్టార్ట్ అప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు ఒకే వేదికపై అవసరమైన సహకారం అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో కడప జిల్లా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా ఎదిగే అవకాశాలు మరింత పెరుగుతాయని అన్నారు.
నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, ప్రస్తుతం ఫినిషింగ్ పనులు, గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా, నిర్ణీత గడువులోపు అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో కడప నగర పాలక సంస్థ కమిషనర్ భవానీ ప్రసాద్, ఎస్ఈ చెన్నకేశవరెడ్డి, హౌసింగ్ పీడీ రాజారత్నం, స్టెప్ సీఈవో జోయల్ విజయ్ కుమార్, కాంట్రాక్టర్లు, ప్రాజెక్ట్ డిజైనర్లు, ఎడిపి యంగ్ ప్రొఫెషనల్స్ తదితరులు పాల్గొన్నారు…
