తిరుచానూరు, జూలై 31 (గరుడధాత్రి న్యూస్) తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచ్చి పై నాలుగు మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి, నిత్య కైంకర్యాలు, అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచ్చి పై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ ముని చెంగల్రాయలు, అర్చకులు బాబు స్వామి, ఇన్స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంత్, మునస్వామి తదితరులు పాల్గొన్నారు.
