అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా
నాగలాపురం సెప్టెంబర్ 4 గరుడధాత్రి:
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కొరడా ఝళిపించారు. మండలంలోని అరుణానది నుంచి ఇసుకను తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లకు సంబంధించిన రికార్డులు, ఇసుక బిల్లులు, అనుమతులను పోలీసులు పరిశీలిస్తున్నారు.
సరైన బిల్లులు, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు తేలితే నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై సునీల్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు మండల పరిధిలో తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
