కార్వేటి నగర సెప్టెంబర్ 4 (గరుడ దాద్రి న్యూస్):
విద్యా రంగంలో సుదీర్ఘకాలంగా విశిష్ట సేవలందిస్తూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల విద్యా ప్రగతికి, పాఠశాల మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేస్తున్న పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కత్తెరపల్లె ప్రధానోపాధ్యాయుడు శ్రీ బి. చెంగల్ రాజు గారు ఈ సంవత్సరం ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.
సుమారు 31 సంవత్సరాలుగా విద్యా శాఖలో వివిధ హోదాల్లో సేవలందించిన చెంగల్ రాజు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా, స్కూల్ అసిస్టెంట్ (గణితం)గా, మండల రిసోర్స్ పర్సన్గా, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా, జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారిగా, డైట్ సీనియర్ లెక్చరర్గా తదితర బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. విద్యా బోధనతో పాటు పరిపాలన, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రతిభా వికాసం, సమాజ భాగస్వామ్యం వంటి అనేక రంగాల్లో ఆయన విశేష సేవలను అందించారు.
దండికుప్పం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా తొలి అడుగు
శ్రీ బి. చెంగల్ రాజు గారు 2012లో పదోన్నతిపై శాంతిపురం మండలం దండికుప్పం పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ పనిచేసిన సమయంలో గ్రామస్థులు, పాఠశాల కమిటీ సభ్యులు, దాతల సహకారంతో పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేశారు.
విరాళాల సహకారంతో విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లకు నీటి వసతి వంటి సదుపాయాలను కల్పించారు. విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించి పదవ తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేశారు.
తొండమనాడు పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర
తదుపరి శ్రీకాళహస్తి మండలం తొండమనాడు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా
పనిచేసిన సమయంలో పాఠశాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక కోకాకోలా సంస్థ సహకారంతో సుమారు రూ.6 లక్షల విలువైన ప్రేయర్ హాల్ నిర్మాణానికి కృషి చేశారు.
పాఠశాల మౌలిక వసతులను గణనీయంగా అభివృద్ధి చేసి జిల్లాలోనే ఉత్తమంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు, ఒకే విద్యా సంవత్సరంలో ఏడుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షలో ఎంపికయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
అదేవిధంగా ప్రతి సంవత్సరం విద్యార్థులు NMMS పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శిక్షణ, మార్గదర్శకత్వం అందించారు.
కత్తెరపల్లె పాఠశాలలో ఏడాదిలోనే గణనీయమైన మార్పులు
గత సంవత్సరం ఏప్రిల్లో డైట్ కళాశాల నుండి బదిలీపై పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కత్తెరపల్లె ప్రధానోపాధ్యాయుడిగా శ్రీ బి. చెంగల్ రాజు గారు బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల నమోదు, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్థుల సహకారంతో వేసవి సెలవుల్లో ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించి సుమారు 120 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. వీరిలో 35 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరడం విశేషం.
ఇది పాఠశాలపై తల్లిదండ్రుల్లో, ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.
పదవ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ
విద్యార్థుల విద్యా ప్రగతిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
