ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి
కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శారదా దేవి
గరుడధాత్రి :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) శారదా దేవి పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ఆదివారం ఉదయం వైకుంఠపురంలోని మార్కెట్ లో నిర్వహించిన పారిశుధ్థ్య పనుల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని చెత్తరహితం గా మార్చేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. మే 22 నుంచి జూన్ 20 వరకు నాలుగు వారాల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్థ్యం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రతి వారం ప్రత్యేక అంశాలపై దృష్టి సారిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ముఖ్యంగా మార్కెట్లు, ప్రధాన రహదారులు, కాలువలు శుభ్రపరిచే పనులు, ప్రజా మరుగుదొడ్ల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం మునిసిపల్ పార్క్ ను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని, విరిగిన ఆట పరికరాలకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, ప్రజా ప్రతినిధులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
