తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో అఖిల భారత యువజన సమాఖ్య 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. సాయికుమార్ AIYF జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం విస్మరించిందన్నారు. యువత, విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
AIYF ప్రధాన డిమాండ్లు:
నిరుద్యోగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
నిరుద్యోగ భృతి అమలు చేయాలి
శ్రీసిటీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, రిజర్వేషన్లు అమలు చేయాలి
ఉపాధి సమస్యలను పరిష్కరించాలి
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఈ కార్యక్రమంలో AIYF జిల్లా నాయకులు మురళి, నాగార్జున, ఏఐటీయూసీ నాయకుడు చంద్ర, ఆటో యూనియన్ నాయకులు బండాలయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.
