చిత్తూరు గరుడధాత్రి : జిల్లాలోని మామిడి రైతులు నష్టపోకుండా వారికి గిట్టుబాటు ధర లభించేలా మామిడి ధరలను పెంచాలని మామిడి ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు.
మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్లో మామిడి ధరల పెంపు అంశంపై జిల్లాలోని మామిడి ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జూన్ 20వ తేదీ తర్వాత నుంచి మామిడి కొనుగోలు ధరలను పెంచాలని యూనిట్ యజమానులను ఆదేశించారు. పెంచిన ధరలను ఆగస్టు నెల వరకు అమలు చేయాలని సూచించారు.
జిల్లాలో మామిడి సాగు చేసే రైతులు ఆర్థికంగా నష్టపోకుండా, వారికి సరైన గిట్టుబాటు ధర అందే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని యూనిట్ యజమానులకు సూచించారు.
