తహశీల్దార్ కార్యాలయంలో మద్యం మత్తులో జూనియర్ అసిస్టెంట్ హల్చల్
నాగలాపురం మండల తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ జూనియర్ అసిస్టెంట్ మద్యం మత్తులో విధులకు హాజరై అర్జీదారులతో దురుసుగా ప్రవర్తించిన ఘటన సోమవారం కలకలం రేపింది. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలతో అసభ్యంగా మాట్లాడటం, సరిగా స్పందించకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో కొందరు అర్జీదారులు వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని సంబంధిత ఉద్యోగిని డ్రింక్ అండ్ డ్రైవ్ మిషన్ ద్వారా తనిఖీ చేశారు. పరీక్షలో అతను మద్యం సేవించినట్లు గుర్తించిన పోలీసులు సంబంధిత రిపోర్టును తహశీల్దార్కు సమర్పించారు
ఈ ఘటనపై స్పందించిన తహశీల్దార్, ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించడం సహించబోమని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంఘటనతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు కొంతసేపు ఆందోళన వ్యక్తం చేశారు.
