సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు మండలాలకు చెందిన మాజీ సిపిఎం నేతలు శుక్రవారం సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ అనుబంధ ప్రజాసంఘాలైన ఏఐకేఎంఎస్, ఐఎఫ్టియులో చేరారు. తిరుపతి జిల్లా నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. వెంకటరత్నం వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఎం సీనియర్ నాయకుడు అరుణాచలం, నాగలాపురం మండల మాజీ కార్యదర్శి మురుగేషన్తో పాటు దినమణి, పద్మ, దక్షిణామూర్తి, డి. మురుగన్ తదితరులు చేరారు.
ఈ సందర్భంగా ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు పి. వెంకటరత్నం మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో అనేక భూ సమస్యలు కొనసాగుతున్నాయని, కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని, రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
అరుణాచలం మాట్లాడుతూ తాను గత 20 ఏళ్లుగా సిపిఎం పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశానని తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీలో సిద్ధాంతాలను పక్కనపెట్టి వ్యక్తిపూజకు ప్రాధాన్యం పెరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తామంతా సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ అనుబంధ ప్రజాసంఘాలలో చేరి ప్రజా సమస్యలపై పనిచేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
