పిచ్చాటూరు, జూన్ 5 గరుడధాత్రి : పిచ్చాటూరు మండల ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు, సూపర్వైజర్లు బాజవతి, సుమతి ఆధ్వర్యంలో పిచ్చాటూరు హెచ్డబ్ల్యూ అంగన్వాడీ కేంద్రంలో కిశోరీ వికాసం కార్యక్రమం మరియు IVRS కాల్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కిశోరీ వికాసం సెషన్-11లో భాగంగా పొగాకు, మద్యం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా అంగన్వాడీ కేంద్ర పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యత, సరైన మోతాదు, పంపిణీ విధానాలపై వివరించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున వచ్చే IVRS ఫోన్ కాల్స్ ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ, గర్భిణులు, బాలింతలు, ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లల తల్లులు, ప్రీ-స్కూల్ పిల్లల తల్లులకు వచ్చే మూడు రకాల ఫోన్ కాల్స్ గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గర్భిణులు, టిహెచ్ఆర్ పిల్లల తల్లులు, ప్రీ-స్కూల్ పిల్లల తల్లులు, గ్రామస్థులు, అంగన్వాడీ టీచర్ అముద, హెల్పర్ గిరిజ పాల్గొన్నారు.
