-మున్సిపల్ కమిషనర్ రమణ రెడ్డి హెచ్చరిక
పలమనేరు, జూన్ 17 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ నంబర్ 9440795840 నుండి వచ్చే ఫోన్ కాల్స్ను నమ్మి మోసపోవద్దని పురపాలక సంఘ కమిషనర్ రమణ రెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా సదరు మొబైల్ నంబర్ నుండి మున్సిపల్ అధికారులమంటూ ఫోన్లు చేస్తూ… ప్రాపర్టీ టాక్స్ (ఆస్తి పన్ను) మరియు ఇతర మునిసిపల్ చెల్లింపులు చేయాలంటూ ప్రజలను నమ్మిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ఇవన్నీ నకిలీ (ఫేక్) కాల్స్ అని, ఇలాంటి వాటికి స్పందించి ఎవరూ డబ్బులు చెల్లించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పురపాలక సంఘానికి సంబంధించిన ఎటువంటి రుసుములు (టాక్సులు/ఫీజులు) అయినా సరే, నేరుగా పురపాలక సంఘ కార్యాలయం (మున్సిపల్ ఆఫీస్) నందు గాని, లేదా సంబంధిత వార్డు సచివాలయాల నందు గాని మాత్రమే చెల్లించాలని కమిషనర్ స్పష్టం చేశారు. నగదు చెల్లించిన వెంటనే దానికి సంబంధించిన అధికారిక రశీదును తప్పనిసరిగా పొందాలని ఆయన ప్రజలకు సూచించారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి ఆన్లైన్లో గానీ, ఇతర మార్గాల్లో గానీ డబ్బులు పంపి మోసపోవద్దని పలమనేరు పట్టణ ప్రజలకు కమిషనర్ రమణ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
