*బ్రహ్మదేవుడు వచ్చినా నన్ను ఆపలేరు: వైకాపా నేత కామిరెడ్డి స్పష్టం
*
- *గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అధికారులను రెచ్చగొడుతున్నారు
- *నా కార్లు, ఆస్తులు సీజ్ చేసినా వైఎస్ జగన్కు అనుచరుడిగానే ఉంటా
- *శాంతియుతంగా వెళ్తున్న మాపై కేసులు బనాయించడం సబబు కాదు
- *ఆటంకాలు సృష్టించినా ఎక్కడ ఆగినా అక్కడే వైఎస్సార్సీపీ పోరాటం మొదలవుతుంది
*పెళ్లకూరు గరుడ దాత్రి ఆగస్టు 22
“తన ప్రాణం పోయినా, నా ఆస్తులు లేదా వాహనాలు సీజ్ చేసినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందడుగు కోసం సాగిస్తున్న పోరాటం ఆగదు.. చివరకు బ్రహ్మదేవుడు దిగొచ్చినా నన్ను వెనక్కి తగ్గించలేరు” అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అత్యంత ఘాటుగా వ్యాఖ్యానించారు. గురువారం పెళ్లకూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
*అధికారులను రెచ్చగొడుతూ అక్రమ కేసులు
ప్రతిరోజూ ఉదయం ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తాము శాంతియుత వాతావరణంలో ‘గుడ్ మార్నింగ్ పెళ్లకూరు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే, ప్రజల మన్ననలు పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకోవాలని అధికార పార్టీ పెద్ద మనిషి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. స్థానిక యంత్రాంగాన్ని, పోలీసులను తమపైకి రెచ్చగొడుతూ అక్రమ కేసులు బనాయించడం ఎంతమాత్రం సబబు కాదన్నారు.
*కార్లు సీజ్ చేసినా వెనకడుగు వేసేది లేదు*
ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వెళ్తే తన వాహనాన్ని అక్రమంగా సీజ్ చేశారని కామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా కారు సీజ్ చేసినా, ఆస్తులు జప్తు చేసినా చివరి శ్వాస వరకు జగన్మోహన్ రెడ్డి అనుచరుడిగానే ఉంటా.. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు విశ్రమించను” అని తేల్చి చెప్పారు. కూటమి నాయకులు చేస్తున్న బెదిరింపులకు, ఆక్రమ ఆటంకాలకు ఇక్కడ ఎవరూ భయపడే ప్రసక్తి లేదన్నారు.
*ఎక్కడ ఆపారో అక్కడి నుంచే మళ్లీ మొదలు పెడతాం*
కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ‘గుడ్ మార్నింగ్ పెళ్లకూరు’ కార్యక్రమం ఆగేది లేదని స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలో అయితే తమ ప్రోగ్రామ్ను అడ్డుకున్నారో, సరిగ్గా అక్కడి నుంచే మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
