గరుడధాత్రి :
కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన (PM-VBRY) పథకం కింద శ్రీసిటీలోని ట్రిపుల్ ఐటీ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పై పథకం కింద ఎంపికైన నూతన ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు.
కార్యక్రమానికి శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) సి.రమేష్ కుమార్, ట్రిపుల్ ఐటీ రిజిస్ట్రార్ డా. దివ్య బ్రహ్మం, తిరుపతి ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్-2 సతీష్ కుమార్, డిప్యూటీ లేబర్ కమిషనర్ సురేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
ఇందుకు సంబంధించి ఈ రోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాలను 15 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయగా, శ్రీసిటీ కూడా వాటిలో ఒకటిగా నిలిచింది.
ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ పీఎం-వీబీఆర్వై పథకాన్ని ప్రశంసించారు. శ్రీసిటీలో 43కు పైగా పరిశ్రమలు ఈ పథకం పరిధిలో ఉన్నాయని తెలిపారు. సతీష్ కుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టికి ఈ పథకం దోహదపడుతుందని చెప్పారు. నెలకు రూ.1 లక్ష వరకు వేతనం పొందే తొలి ఉద్యోగులకు రూ.15 వేల వరకు ఆర్థిక ప్రోత్సాహకం రెండు విడతల్లో పీఎఫ్ ఖాతాల్లో జమ అవుతుందని వివరించారు. అదనపు ఉద్యోగాలను కల్పించే యజమానులకు నెలకు రూ.3 వేల వరకు ప్రోత్సాహకం అందజేస్తారని తెలిపారు. ఈ పథకంలోని ప్రధాన అంశాలను మధుసూదన రావు వివరించారు. లబ్ధిదారులు, కంపెనీ ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకుంటూ పథకం ప్రయోజనాలను వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో 150 మందికి పైగా యజమానులు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పథకం కింద 85 మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించగా, లాంఛనంగా 25 మందికి నియామక పత్రాలను అందజేశారు.
