-ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
-సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం. రమేష్ డిమాండ్
గరుడధాత్రి :సత్యవేడు నియోజకవర్గంలో ప్రైవేట్ మెడికల్ షాపుల అక్రమాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చిన మెడికల్ మాఫియాపై ప్రభుత్వం వెంటనే ఉక్కుపాదం మోపాలని సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం. రమేష్ డిమాండ్ చేశారు.
గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్లినప్పుడు మందుల పేరుతో అధిక ధరలు వసూలు చేసి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. కొంతమంది మెడికల్ షాపుల నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.
ప్రజలకు నాణ్యమైన మందులు సరసమైన ధరలకు అందేలా సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అక్రమాలకు పాల్పడుతున్న మెడికల్ షాపులపై విస్తృత తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఆరోగ్య రంగంలో అవినీతి, అక్రమాలు, దోపిడీకి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం విఫలమైతే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని ఎం. రమేష్ హెచ్చరించారు.
