తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండలం, తొండంబట్టు పంచాయతీ
గ్రామ అభివృద్ధికి ప్రతీకగా నిలవాల్సిన నాగనందపురం గ్రామం ప్రస్తుతం మురుగు నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గ్రామంలోని పలు వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి పొంగి పొర్లుతోంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రజలు రోజూ ఈ మురుగు నీటిలోనే నడవాల్సి వస్తుండటంతో అసహనానికి గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో పాటు ఈ మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి, డెంగ్యూ, మలేరియా వంటి అంటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి గ్రామంలో శుభ్రతను కల్పించాలని వారు కోరుతున్నారు.
