చౌడేపల్లి ఆగస్టు 02 గరుడ దాత్రి న్యూస్
సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు మండలంలోని శెట్టిపేట గ్రామస్తులు ప్రాచీన ఆచారమైన ‘కప్పదేవర’ (కప్పల పెళ్లి) వేడుకను ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక మోక్ష గణపతి ఆలయం వద్ద పలు కార్యక్రమాలు నిర్వహించారు రుతుపవనాలు ముఖం చాటేయడం, ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నా చినుకు రాలకపోవడంతో సాగుకు సిద్ధమైన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వాన దేవుడి కరుణ కోసం గ్రామస్తులంతా ఏకమై సంప్రదాయబద్ధంగా ఈ వేడుకను జరిపారు.
అంగరంగ వైభవంగా కప్పల పెళ్లి
గ్రామస్తులు ఉదయాన్నే పొలాల్లోకి వెళ్లి రెండు కప్పలను పట్టుకొచ్చారు. వాటిలో ఒకదానిని పెళ్లికొడుకుగా, మరొకదానిని పెళ్లికూతురుగా అలంకరించారు. పసుపు నీళ్లతో స్నానం చేయించి, కుంకుమ బొట్లు పెట్టి, పూల దండలు వేసి నూతన వస్త్రాలతో ముస్తాబు చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ కప్పలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపారు.
గ్రామ పురవీధుల్లో ఊరేగింపు
వివాహానంతరం కప్పలను ఒక పల్లకిలో ఉంచి, డప్పు చప్పుళ్లు, మహిళల కోలాటాల మధ్య గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. మహిళలు కప్పలకు మంగళ హారతులు పట్టారు. ఈ సందర్భంగా “వాన దేవుడా.. వానలు కురిపించు.. పంటలు పండించు” అంటూ గ్రామస్తులు పాడిన జానపద గీతాలు ఆకట్టుకున్నాయి. ఊరేగింపు పూర్తయిన తర్వాత ఆ రెండు కప్పలను తీసుకెళ్లి స్థానిక చెరువులో విడిచిపెట్టారు.
