*కత్తితో బెదిరించి ఫోన్ పే ద్వారా వసూలు*
*వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్, రిమాండ్*
బాధితులను బెదిరిస్తే కఠిన చర్యలు తప్పవు
వేములవాడ టౌన్ సీఐ వీర ప్రసాద్ హెచ్చరిక
వేములవాడ : విలేకరుల ముసుగు లో కొంత మంది నకిలీ జర్నలిస్టు లు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు.తాజా గా వేములవాడ పట్టణం లోని ఓ సూపర్ మార్కెట్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నిందితుడిని వేములవాడ టౌన్ పోలీసులు ఆది వారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన గోడిశేల మహేష్ అనే వ్యక్తి జర్నలిస్టుగా పరిచయం చేసుకుని, సూపర్ మార్కెట్ యజమానిని భయభ్రాంతులకు గురిచేశాడు. అధికారులతో తనిఖీలు చేయిస్తానని, పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. కత్తితో ప్రాణహాని తలపెడతానని హెచ్చరించి బాధితుడి నుండి ఫోన్ పే ద్వారా రూ. 42,000 వసూలు చేశాడు. నిందితుడు మళ్లీ డబ్బుల కోసం వేధిస్తుండటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.ఎస్ఐ రామ్మోహన్, కానిస్టేబుల్ గోపాల్ దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరైనా మీడియా ముసుగు , అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నిందితుడు మహేష్ చేతిలో మరెవరైనా మోసపోయి ఉంటే స్టేషన్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
