శ్రీకాళహస్తి ఆగస్టు 02 (గరుడ దాత్రీ న్యూస్):
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో అక్రమ ఇసుక మాఫియా యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత ప్రభుత్వఅధికారులు, గనుల శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని, సిపిఐ( ఎం ఎల్) న్యూ డెమోక్రసీ శ్రీకాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి జాకీర్ విమర్శించారు.పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతుండగా ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లుతోందని, నదుల సహజ స్వరూపం దెబ్బతింటూ పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు. స్థానిక ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
అక్రమ ఇసుక దందాలో పాల్గొంటున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమరవాణాకువినియోగిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి శ్రీకాళహస్తిలో అక్రమ ఇసుక దందాను పూర్తిగా అరికట్టాలని, లేకపోతే ప్రజలను సమీకరించి సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు మూర్తి. రషీద్ బాలయ్య. తదితరులు పాల్గొన్నారు.
