– స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పుత్తూరు టౌన్ పోలీసుల ముందస్తు చర్యలు
– రౌడీషీటర్ల ఇళ్లను సందర్శించి వ్యక్తిగతంగా హెచ్చరించిన పోలీసులు
– ఎన్నికల సమయంలో నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
– శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచన
– ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి
తిరుపతి ఆగస్టు 19 గరుడధాత్రి :
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పుత్తూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక ముందస్తు చర్యలు చేపట్టింది. *తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,* గారి ఆదేశాల మేరకు, పుత్తూరు డీఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా పుత్తూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది కలిసి పుత్తూరు పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రౌడీషీటర్ల ఇళ్లను సందర్శించి, వారిని వ్యక్తిగతంగా కలిసి హెచ్చరించారు.
ప్రధానంగా వీరపరెడ్డిపాలెం, బత్తలవారికండ్రిగ, గేట్ పుత్తూరు, వీవర్స్ కాలనీ, కామరాజ్ నగర్ తదితర ప్రాంతాల్లోని రౌడీషీటర్లకు, ఎన్నికల సమయంలో ఎటువంటి నేర కార్యకలాపాలకు పాల్పడకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టంగా సూచించారు.
ఎన్నికల సమయంలో ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, ప్రజా శాంతికి భంగం కలిగించినా, చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా మరియు సజావుగా జరిగేలా పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు.
పుత్తూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.
